Andhra Pradesh: ప్రేమ పెళ్లికి పెద్దల తిరస్కారం.. ఉరేసుకున్న ప్రియురాలు.. రైలు కింద పడి ప్రియుడి ఆత్మహత్య!

  • పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం
  • ప్రియురాలి ఆత్మహత్య విషయం విని ప్రాణం తీసుకున్న ప్రియుడు
  • రెండు కుటుంబాల్లో విషాదం

ప్రేమ పెళ్లికి తల్లి అడ్డు చెప్పిందన్న మనస్తాపంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలిసిన ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. చిట్టివలసపాకలకు చెందిన గుడ్ల దుర్గారావు (23)జూట్ మిల్లులో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పూతిక గంగాభవానీ (19) ఓ దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇంట్లో చెప్పగా, ఇరు కుటుంబాల వారు అందుకు నిరాకరించారు. అంతేకాదు, రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.

గురువారం రాత్రి మరోమారు వివాహం విషయం ప్రస్తావనకు రాగా, గంగాభవానీ తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగా భవానీ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన దుర్గారావు సమీపంలోని రైలు పట్టాల వద్దకు చేరుకొని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News