Forbes: ఫోర్బ్స్ తాజా జాబితా... భారత టాప్-10 బిలియనీర్ల వివరాలు!

  • టాప్-100 జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
  • ముఖేష్ అంబానీ ఆస్తులు రూ. 3.49 లక్షల కోట్లు
  • తరువాతి స్థానాల్లో అజీమ్ ప్రేమ్ జీ, లక్ష్మీ మిట్టల్
  • జాబితాలో మహిళలు నలుగురే

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ అధినేత ముకేశ్‌ అంబానీ భారత బిలియనీర్లలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ బిజినెస్ మేగజైన్ 'ఫోర్బ్స్‌' 2018 సంవత్సరానికి గానూ 'ఇండియన్ బిలియనీర్స్ లిస్ట్'ను విడుదల చేయగా, వరుసగా 11వ సంవత్సరం ముకేశ్ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ముఖేష్ సంపద విలువ రూ. 3.49 లక్షల కోట్లు. 2019లో ఆయన సంపద సుమారు రూ. 68 వేల కోట్లు పెరిగింది.

 ఇక ఈ జాబితాలో ముఖేష్ అంబానీ తరువాతి స్థానంలో రూ. 1.55 లక్షల కోట్ల ఆస్తితో విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌ జీ నిలిచారు. ఆయన తరువాత ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రూ. 1.35 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొత్తం 100 మంది బిలియనీర్ల పేర్లను వెల్లడిస్తూ, 'ఫోర్బ్స్‌' ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం భారత బిలియనీర్ల సంపద 492 బిలియన్‌ డాలర్లని పేర్కొంది. వీరిలో 11 మంది ఆస్తులు గత సంవత్సరంతో పోలిస్తే, కనీసం 1 బిలియన్‌ డాలర్ల కన్నా పెరిగిందని, ఈ జాబితాలో కేవలం నలుగురు మహిళలు మాత్రమే స్థానం సంపాదించుకున్నారని తెలిపింది. బయోకాన్‌ ఛైర్‌ పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా రూ. 26వేల కోట్ల సంపదతో 39వ స్థానంలో నిలిచారు.

ఇక ఈ జాబితాలోని టాప్-10 బిలియనీర్లలో వరుసగా ముకేశ్‌ అంబానీ (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌), అజిమ్‌ ప్రేమ్‌ జీ (విప్రో), లక్ష్మీ మిట్టల్‌ (ఆర్సిలర్ మిట్టల్), హిందుజా సోదరులు (అశోక్‌ లేల్యాండ్‌), పల్లోంజీ మిస్త్రీ (షాపూర్‌ జీ పల్లోంజీ గ్రూప్‌), శివ్‌ నాడార్‌ (హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌), గోద్రేజ్‌ ఫ్యామిలీ (గోద్రేజ్‌ గ్రూప్‌), దిలీప్‌ సంఘ్వీ (సన్‌ ఫార్మాస్యుటికల్స్), కుమార మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్‌), గౌతమ్‌ అదానీ (అదానీ పోర్ట్స్‌) ఉన్నారు.

More Telugu News