nijamabad: పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. వధువు కుటుంబ సభ్యుల దాడి!

  • అడ్డు వచ్చిన కానిస్టేబుల్‌పైనా దౌర్జన్యం
  • నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో ఘటన
  • నూతన దంపతులకు రక్షణ కల్పిస్తామని పోలీసుల హామీ

వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు... కాదనడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకునేందుకు వెళ్లిన ఈ జంటపై వధువు కుటుంబ సభ్యులు దాడిచేసిన ఘటన ఇది. అడ్డుకున్న కానిస్టేబుల్‌పైనా దౌర్జన్యం చేశారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నవీపేట ఎస్‌ఐ తెలిపిన వివరాలివి.

నవీపేట మండలంలోని నాళేశ్వర్‌ గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తుడు బేస రాజు, అదే మండంలోని బీసీ కులానికి చెందిన నిరీష రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి వధువు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఎమ్మార్పీఎస్‌ నాయకుల సహకారంతో జాన్కంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని నవీపేట స్టేషన్‌కు వెళ్లారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరువర్గాల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులు వారిని రప్పించారు.

తమకు అంగీకారం లేని పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఆవేశంగా స్టేషన్‌కు వచ్చిన వధువు తల్లి, ఆమె సోదరులు నూతన జంటపై దాడిచేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌పైనా దౌర్జన్యం చేశారు. వీరి పెళ్లికి సహకరించిన వారిని దుర్భాషలాడుతూ వెళ్లిపోయాడు. వీరి తీరును చూసిన పోలీసులు నూతన జంటకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News