Police: భర్త వంశం అంతరించిపోరాదంటూ... ఉరేసుకున్న వివాహిత!

  • 11 ఏళ్ల క్రితం వివాహం, కలగని సంతానం
  • భర్త బాగానే చూసుకుంటున్నాడంటూ సూసైడ్ నోట్
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

తనకు పిల్లలు పుట్టరని తేలిందని, తానుంటే భర్త వంశం అంతరించిపోతుందని, ఇది జరుగకూడదని సూసైడ్ లేఖలో పేర్కొన్న ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనకదుర్గకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట సత్యనారాయణకు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. సత్యనారాయణ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో పనిచేస్తూ, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు బదిలీపై వచ్చాడు.

ఈ పంపతులకు సంతానం కలగకపోవడంతో భార్యాభర్తల మధ్య గత కొన్నేళ్లుగా తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి కనకదుర్గ ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది. భర్త సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని పరీక్షల్లో తేలినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని కనకదుర్గ తన లేఖలో పేర్కొంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, భర్త తనను చక్కగా చూసుకుంటున్నాడని తెలిపింది. అయితే, ఫ్యానుకు ఆమె ఉరేసుకున్న తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News