Telangana: నవంబర్ 24న తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని నేను చెప్పానా?: మీడియాపై ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆగ్రహం

  • తాను చెప్పినట్లు వార్తలు రాయడంపై అసహనం
  • సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు వెల్లడి
  • బేగంపేటలో ఈసీ వర్క్ షాపులో పాల్గొన్న రజత్ కుమార్

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఈరోజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నవంబర్ 24న తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తామని తాను చెప్పినట్లు కొన్ని టీవీలు, పత్రికలు ప్రచారం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈసీ వర్క్ షాప్ నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి రజత్ కుమార్ హాజరయ్యారు. మీడియాలో వస్తున్న వార్తలపై జిల్లాల ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా రజత్ కుమార్ సూచించారు. వచ్చే నెల 24న ఎన్నికలు నిర్వహిస్తామని తాను చెప్పినట్లు అసత్యపు వార్తలు రాయడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఎన్నికల వార్తలపై కూడా పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నామని స్పష్టం చేశారు.తప్పుడు వార్తలు రాసినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News