MS Dhoni: ఆసియా కప్ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం.. కోహ్లీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన బంగ్లాదేశీయులు!

  • ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్
  • జీర్ణించుకోలేకపోతున్న బంగ్లా ఫ్యాన్స్
  • ఐసీసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఆసియా కప్ ఫైనల్ ఓటమికి బంగ్లాదేశ్ అభిమానులు భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత్ చేతిలో ప్రతీకారాన్ని జీర్ణించుకోలేని బంగ్లా ఫ్యాన్స్ నీచమైన చర్యకు పాల్పడ్డారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ (సీఎస్ఐ) పేరుతో ఓ హ్యాకింగ్ గ్రూప్ ఈ దిగజారుడు చర్యకు పాల్పడింది.

వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సీఎస్ఐ అందులో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ స్టంప్ అవుట్ ఫొటోలను పోస్టు చేసింది. అంపైర్ల తప్పుడు నిర్ణయం వల్లే బంగ్లాదేశ్ ఓటమి పాలైందని ఆరోపిస్తూ అందులో లిటన్ దాస్ ఫొటోలను పోస్టు చేశారు. ఫైనల్లో సెంచరీ చేసిన లిటన్ దాస్.. ధోనీ చేతిలో వివాదాస్పద రీతిలో స్టంపౌట్ అయ్యాడు. పలుమార్లు రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ లిటన్ దాస్ అవుటైనట్టు ప్రకటించాడు. ఇది వివాదాస్పదమైంది.

ఈ ఫొటోలను పోస్టు చేసిన హ్యాకర్లు, లిటన్ దాస్ ఎలా అవుటయ్యాడో చూశాక కూడా క్రికెట్ జెంటిల్మన్ గేమ్ ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐసీసీ క్షమాపణ చెప్పాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇష్టం లేకుంటే లిటన్ దాస్‌ను అవుట్‌ గా ప్రకటించిన అంపైర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయులంటే తమకు కోపం లేదని, కానీ ఈ విషయంలో వారు కూడా ఓసారి ఆలోచించాలని కోరారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని జట్లను సమానంగా చూడాల్సి ఉంటుందని హ్యాకర్లు పేర్కొన్నారు.

More Telugu News