Prakasam District: పొలం తనకు అమ్మలేదని.. చెల్లెలిని నడిరోడ్డుపై నరికేసిన అన్న.. ప్రకాశం జిల్లాలో దారుణం!

  • బాబాయి కుమార్తెను కత్తితో పొడిచి చంపిన అన్న
  • పొలం తమకు అమ్మలేదని కక్ష
  • బస్టాండ్ వద్ద అందరూ చూస్తుండగానే దారుణం

పొలం తనకు విక్రయించలేదన్న ఆగ్రహంతో చెల్లెలిని నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశాడో అన్న. ప్రకాశం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృష్ణమూర్తి, రాజారావు అన్నదమ్ములు. పెద్దవాడైన రాధాకృష్ణకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రాజారావుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణకు చెందిన ఎకరం పొలం విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉంది.

పొలం తనకే విక్రయించాలంటూ రాజారావు కుమారుడు సింగయ్య (40) గత కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. ఇందుకు రాధాకృష్ణ నిరాకరించాడు. దీంతో ఆ పొలం మరెవరూ కొనకుండా అడ్డంకులు సృష్టించాడు. సింగయ్య అడ్డుపడుతున్నా రాధాకృష్ణ ఎలాగోలా పొలాన్ని అమ్మేసి ఆరు నెలల క్రితం కుమార్తె పద్మావతికి పెళ్లి చేశాడు. సోషల్ వర్క్‌లో పీజీ చేసిన పద్మావతి భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది.

స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనే పద్మావతి మంగళవారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామానికి వచ్చింది. ఒంగోలులో అవార్డు స్వీకరించేందుకు వెళ్తుండగా బస్ స్టాప్ వద్ద కాపు కాసిన సింగయ్య ఆమెపై కత్తితో దాడి చేశాడు. శరీరంపై ఎడాపెడా పొడిచాడు. మొత్తం పదిచోట్ల కత్తి పోట్లు కావడంతో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. సింగయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News