balakrishna: తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం: ఖమ్మం జిల్లా పర్యటనలో బాలకృష్ణ

  • తెలుగు జాతి ప్రతిష్ఠను నలు మూలలకు చాటిన మహనీయుడు ఎన్టీఆర్
  • తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ఎంతో కృషి చేశారు
  • తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బాలయ్య

తెలుగుజాతి కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచ నలుమూలలకు చాటిన మహనీయుడు దివంగత ఎన్టీఆర్ అని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఈరోజు ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారంలో బాలయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామమైన జొన్నలగడ్డ నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వందలాది మోటార్ సైకిళ్లతో బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. రాయపట్నం గ్రామంలోని ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు బాలయ్య పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఆ తర్వాత దెందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, పైవ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో మహాకూటమి జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. మహాకూటమి తొలి గెలుపు మధిర స్థానం నుంచే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నామా నాగేశ్వరరావు, స్వర్ణకుమారి తదితరులు కూడా హాజరయ్యారు.

More Telugu News