Pranay: తుంగపాడు బంధంలో ప్రణయ్‌ హత్యాయుధం కోసం పోలీసుల గాలింపు!

  • హత్య అనంతరం ఘటనా స్థలిలోనే  కత్తిని పడేసిన శర్మ
  • రెండో ఆయుధాన్ని బంధంలోకి విసిరేసినట్లు వెల్లడి
  • రెండో కత్తికోసం పోలీసుల గాలింపు 

మిర్యాలగూడలో ఇటీవల ప్రణయ్ పరువు హత్యకు గురైన వార్త పెద్ద సంచలనం అయిన సంగతి విదితమే. అతని హత్యకు వినియోగించిన ఓ ఆయుధం కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ప్రణయ్‌ హత్య కోసం రెండు ఆయుధాలను నిందితులు సిద్ధం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన సుఫారీ కిల్లర్‌ సుభాష్‌శర్మ ఈ హత్యకు ఒక కత్తిని వినియోగించాడు. ఆస్పత్రి నుంచి భార్య, తల్లితో కలిసి వస్తున్న ప్రణయ్‌ని వెనుక నుంచి వచ్చి మెడపై నరికేశాడు.

అనంతరం పడిపోయిన ప్రణయ్‌ని మరోసారి నరికి ఆ కత్తిని ఘటనా స్థలిలోనే విసిరేసి నడుచుకుంటూ కొద్దిదూరం వెళ్లిపోయాడు. అక్కడ తనకోసం స్కూటీతో ఎదురు చూస్తున్న గ్యాంగ్‌లోని మరో సభ్యుడు అస్గర్‌ ఆలీతో కలిసి సాగర్‌ రోడ్డు మీదుగా నల్లగొండకు చేరుకున్నాడు. నిందితులిద్దరూ పారిపోయే క్రమంలో మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామ సమీపంలోని బంధం వద్ద ఆగి వంతెన కింద పిల్లర్ల వద్ద సేదదీరినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

అంతేకాక, ఆ సందర్భంగా శర్మ బంధంలో స్నానం చేసి హత్య సమయంలో వేసుకున్న షర్ట్‌ను, స్కూటీ సీటు కింద దాచిన మరో ఆయుధాన్ని బంధంలో పడవేసినట్లు తెలుసుకున్నారు. దీంతో నల్లగొండ పోలీసులు నిందితులు శర్మ, అస్గర్‌ ఆలీలను తుంగపాడు బంధం వద్దకు తీసుకువచ్చారు. గంటన్నరపాటు గాలింపు చర్యలు చేపట్టినా ఆయుధంగాని, షర్ట్‌గాని లభించలేదు. బంధంలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గాలింపునకు ఆటంకంగా మారింది. గాలింపు పూర్తయ్యాక నిందితులను పోలీసులు తిరిగి నల్లగొండ తీసుకువెళ్లారు.

More Telugu News