Kadiam Srihari: కొండా దంపతులు వెళ్లిపోవడంతో పీడ విరగడైంది!: కడియం శ్రీహరి

  • వరంగల్ తూర్పులో గెలవలేకే.. పరకాలకు పారిపోయారు
  • ఈ నియోజవర్గానికి పట్టిన పీడ విరగడై పోయింది
  • కేసీఆర్, కేటీఆర్ లపై అవాకులు చవాకులు పేలారు

టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులపై టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలవలేకే... పరకాలకు పారిపోయారని ఎద్దేవా చేశారు. వీరు వెళ్లిపోవడంతో... ఈ నియోజకవర్గానికి పట్టిన పీడ విరగడైందని, టీఆర్ఎస్ అభ్యర్థిని కలసికట్టుగా గెలిపించుకుంటామని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా ఈ నియోజకవర్గానికి కొండా సురేఖ చేసిందేమీ లేదని అన్నారు. కార్పొరేటర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా... వారిని అగౌరవపరిచారని మండిపడ్డారు.

గత ఆరు నెలలుగా కొండా దంపతుల తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించారని... అందుకే అభ్యర్థుల తొలి జాబితాలో వారి పేరును ప్రకటించలేదని శ్రీహరి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై అవాకులు చవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల ప్రభావం ఏమీ లేదని.... మొత్తం 21 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.

More Telugu News