Hyderabad: ప్రేయసిని వదల్లేక వివాహితుడి ఆత్మహత్య... విషయం తెలిసి ఆమె కూడా..!

  • ఆగస్టు 15న శివకుమార్ కు వివాహం
  • పెళ్లయినా ప్రియురాలితో సంబంధం
  • భార్య హెచ్చరిస్తే భయంతో ఆత్మహత్య

నెలన్నర క్రితమే వివాహమైంది. అయినా పాత పరిచయస్తురాలైన ప్రేయసిని వదిలి ఉండలేకపోయాడు. ఆమెతో సంబంధం భార్యకు తెలిసి నిలదీయగా, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. రెండు ఇండ్లలో విషాదాన్ని నింపిన ఈ ఘటన హైదరాబాద్, మారేడ్ పల్లిలో జరిగింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కే శివకుమార్ (22) అనే యువకుడికి లహరితో ఆగస్టు 15న వివాహం జరిగింది. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న శివకుమార్, నెలరోజులుగా భార్యతో ఉంటున్నాడు. శివకు వెన్నెల అనే మరో అమ్మాయితో పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. పెళ్లయిన తరువాత కూడా ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. నిత్యమూ వాట్స్ యాప్ లో వెన్నెలతో చాటింగ్ చేస్తున్న భర్తను గమనించిన లహరి, అతన్ని నిలదీసింది. విషయం ఇంటి పెద్దలకు చెబుతానని హెచ్చరించింది. దీంతో భయాందోళనకు గురైన శివకుమార్, శనివారం నాడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం వెన్నెలకు తెలిసింది. శివకుమార్ మరణించాడన్న మనస్తాపంతో ఆమె వెంటనే యాసిడ్ తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె ఆదివారం నాడు మరణించింది. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News