Revanth Reddy: ఆ ఇంటిని 22 ఏళ్లుగా లీజుకు ఇస్తున్నాం.. అక్కడున్న అన్ని కంపెనీలకు నేనే ఓనర్ అంటే ఎలా?: రేవంత్ రెడ్డి

  • బంజారాహిల్స్ ఇంటిలో చాలా కంపెనీలు ఉన్నాయి
  • అద్దెకుండేవారు ఇంటి అడ్రస్ పైనే రిజిస్ట్రేషన్ చేస్తారు
  • మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. రేవంత్ అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని, దాదాపు 18 డొల్ల(షెల్) కంపెనీల ద్వారా వందల కోట్లను దేశం దాటించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని తన ఇంటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై వచ్చిన పలు ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.

బంజారాహిల్స్ లోని తన నాలుగు అంతస్తుల భవనం నుంచి అవినీతికి పాల్పడినట్లు కొందరు ఆరోపించడంపై రేవంత్ సీరియస్ గా స్పందించారు. తాను 18 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించడంపై మాట్లాడుతూ.. బంజారాహిల్స్ లోని ఇంటిని 22 ఏళ్లుగా కంపెనీలకు లీజుకు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ చాలా కంపెనీలు ఆ బిల్డింగ్ ను లీజుకు తీసుకున్నాయని వెల్లడించారు.

కంపెనీలు సాధారణంగా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అద్దెకున్న ఇంటి అడ్రస్ పైనే చేపడతాయనీ, వాటన్నింటిని తన నెత్తిపై రుద్దితే ఎలాగని రేవంత్ ప్రశ్నించారు. తాను 23 మంది డైరెక్టర్లను నియమించి బినామీ కంపెనీలను నడిపానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెచ్చగొట్టిన ఓ జంతువు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రతీకార రాజకీయాలు ఎన్నటికీ మంచిది కాదని రేవంత్ హితవు పలికారు.

More Telugu News