Facebook: ఫేస్‌బుక్‌పై మరోమారు హ్యాకర్ల దాడి.. 5 కోట్ల ఖాతాల సమాచారం చోరీ!

  • సమాచారం చోరీకి గురైందన్న ఫేస్‌బుక్ సీఈవో
  • లోపాన్ని సరిచేసినట్టు వెల్లడి
  • ప్రభుత్వానికి ఫిర్యాదు

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మారోమారు హ్యాకర్ల బారిన పడింది. ఏకంగా ఐదు కోట్ల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారు. వెబ్‌సైట్‌ భద్రత వ్యవస్థలోని లోపం సాయంతో హ్యాకర్లు ‘యాక్సెస్ టోకెన్స్’ను చోరీ చేసినట్టు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. మంగళవారమే ఈ లోపాన్ని గుర్తించామని, గురువారం రాత్రికి దానిని సరిచేశామని ఆయన పేర్కొన్నారు.

హ్యాకర్లు చోరీ చేసిన వినియోగదారుల ఖాతాలు దుర్వినియోగమైనదీ, లేనిదీ తెలియరాలేదు. హ్యాకింగ్ చాలా తీవ్రమైన సమస్యేనని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. మన ఖాతా ఇతరులకు ఎలా కనిపిస్తుందో చూపించే ‘వ్యూ అజ్’ ఫీచర్‌లోనే లోపం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి దీనిని నిలిపివేసినట్టు చెప్పారు. ఈ ఫీచర్‌ను వినియోగించిన 4 కోట్ల మంది ఖాతాదారుల యాక్సెస్ టోకెన్లను ముందు జాగ్రత్త చర్యగా ఫేస్‌బుక్ మార్చేసింది. కాగా, హ్యాకింగ్ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి.

More Telugu News