TRS: జానారెడ్డి, జైపాల్ లపై జరగని ఐటీ దాడులు ఒక్క రేవంత్ రెడ్డిపైనే ఎందుకు జరుగుతున్నాయ్?: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్

  • రేవంత్ ఐటీ శాఖకు అడ్డంగా దొరికిపోయారు
  • కొడంగల్ లో బ్లాక్ మెయిలింగ్, భూకబ్జాలకు పాల్పడ్డాడు
  • అతనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులకు, టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిపోయిందని విమర్శించారు. తప్పులు, అక్రమాలు చేసినందుకు సోదాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ను విమర్శించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు.

దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డిలపై జరగని ఐటీ దాడులు ఒక్క రేవంత్ పైనే ఎందుకు జరుగుతున్నాయని సుమన్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారీగా అక్రమ నగదు చలామణికి పాల్పడ్డాడని ఆరోపించారు. బ్లాక్ మెయిలింగ్ తో పాటు భూకబ్జాలకు పాల్పడ్డాడని విమర్శించారు. ఇలా చేసిన అన్యాయాలకు ఈరోజు రేవంత్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడని వెల్లడించారు.

ఒకే అడ్రస్ పైనే 18-19 డొల్ల కంపెనీలను రేవంత్ ఓపెన్ చేయడం చట్టబద్ధమా, కాదా? అన్నది కాంగ్రెస్ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ తో పాటు హాంకాంగ్ లో బ్యాంక్ అకౌంట్లు తెరిచిన రేవంత్ 2014, ఫిబ్రవరిలో ఒకేరోజు రూ.20 కోట్లకు పైగా ఆర్థిక వ్యవహారాలు నడిపాడని విమర్శించారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ నేతలు వెనకేసుకుని రావడం సిగ్గుచేటన్నారు.

More Telugu News