uma bharathi: అయోధ్యపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

  • అయోధ్య ముస్లింలకు పవిత్ర స్థలం కాదు
  • సౌదీ అరేబియాలోని మక్కా ముస్లింలకు పవిత్ర స్థలం
  • రాముడు జన్మించాడు కాబట్టి అయోధ్య హిందువులకు పవిత్ర స్థలం

అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు నిన్న కీలక రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ముస్లింలకు పవిత్ర స్థలం కాదని ఆమె అన్నారు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి హిందువులకు ఇది పవిత్ర స్థలమని చెప్పారు. ముస్లింలకు సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర స్థలమని తెలిపారు. 16వ శతాబ్దంలో రాముడి దేవాలయం స్థానంలో బాబ్రీ మసీదును నిర్మించారని గతంలోనే ఉమాభారతి పలుమార్లు చెప్పారు. పలువురు బీజేపీ నేతలతో కలసి బాబ్రీ మసీదు కూల్చివేత కార్యకర్తలను ఉద్దేశించి అప్పట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.

అయోధ్యలో రామమందిరం- బాబ్రీ మసీదు వివాదం కేసును ఐదుగురు జడ్జీల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ చివరివారంలో విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే తుది నిర్ణయంపై 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాగా, ఈ తీర్పు విషయంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ లతో జస్టిస్ అబ్దుల్ నజీర్ విభేదిస్తూ, విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడ్డారు.  

More Telugu News