Motkupalli Narsimhulu: మిత్రమా... నన్ను వాడుకో: కేసీఆర్ కు మోత్కుపల్లి బంపరాఫర్

  • కేసీఆర్ కు దగ్గర కావాలని చూస్తున్న మోత్కుపల్లి
  • అవకాశం ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లనూ గెలిపిస్తా
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను పీడిస్తున్నారన్న మోత్కుపల్లి

తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు, ఇప్పుడు కేసీఆర్ కు దగ్గర కావాలని భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పిస్తున్న ఆయన, తాజాగా యాదగిరిగుట్టలో మాట్లాడుతూ కేసీఆర్ కు బంపరాఫర్ ఇచ్చారు. కేసీఆర్ ను మిత్రుడిగా సంబోధించిన ఆయన, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను వాడుకుంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 సీట్లనూ గెలిపించి టీఆర్ఎస్ చేతిలో పెడతానని అన్నారు.

 కేసీఆర్ తనకు చాలాకాలంగా తెలుసునని, ఆయన స్నేహం, చూపించే ప్రేమ నిజమని నమ్మానని అన్నారు. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల రక్తాన్ని జలగల మాదిరిగా పీల్చుతున్నారని తెలిపారు. కేసీఆర్ సరైన నిర్ణయాలు తీసుకోకుంటే, 12 సీట్లలో ఒక్కటి కూడా గెలిచే అవకాశం ఉండదని తెలిపారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు తమ తమ వ్యాపారాలను చూసుకుంటూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ఒక్కొక్కరూ రూ. 500 కోట్లు కూడబెట్టారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

More Telugu News