Karnataka: ప్రియురాలి కోసం భార్య హత్యకు సుపారీ.. పిల్లల్ని చూసి కరిగిపోయిన కిల్లర్.. డీల్ క్యాన్సిల్!

  • భార్యను చంపించేందుకు హెడ్‌కానిస్టేబుల్ సుపారీ
  • పిల్లల్ని చూసి కరిగిపోయి డీల్ రద్దు చేసుకున్న కిల్లర్
  • నిందితుల అరెస్ట్ 

హంతకులకూ మనసు ఉంటుందని నిరూపించాడీ కిల్లర్. ఓ వివాహితను హత్య చేసేందుకు సుపారీ తీసుకున్నాడు. ఆమెను చంపేందుకు వెళ్తే అక్కడామె పిల్లలు కనిపించారు. ఆమెను చంపితే వారు అనాథలైపోతారని భావించి డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. శివమొగ్గలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే రవీంద్రగిరి-అనిత దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి 8 ఏళ్ల అబ్బాయి, 6 ఏళ్ల అమ్మాయి ఉన్నారు. రవీంద్రకు గత కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని ప్రియురాలిని పెళ్లాడాలని ప్లాన్ వేశాడు.

భార్య అనితను చంపించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్ ఫిరోజ్‌తో రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనితను హత్య చేసేందుకు ఫిరోజ్ తన అనుచరులు సయ్యద్ ఇర్ఫాన్, సుహైల్‌లతో కలిసి వెళ్లాడు. అయితే, అక్కడామె పిల్లల్ని చూసి చలించిపోయాడు. ఆమెను చంపితే పిల్లలు అనాథలైపోతారని భావించాడు. మూడుసార్లు హత్యకు ప్రయత్నించినా ప్రతిసారీ పిల్లల భవిష్యత్ గుర్తుకు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇక ఆ హత్యను చేయలేనని ఒప్పందం నుంచి తప్పుకున్నాడు.

ఇటీవల మరో కేసులో ఫిరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి అనిత ఫొటోను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఫిరోజ్, ఇర్ఫాన్‌, సుహైల్‌, రవీంద్రలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News