Jana Reddy: ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: జానా రెడ్డి

  • రేవంత్ రెడ్డి ఇళ్లలో జరుగుతున్న ఐటీ దాడులను ఖండిస్తున్నాం
  • భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోంది
  • ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు లొంగరు

రేవంత్ రెడ్డి ఇళ్లలో జరుగుతున్న ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ప్రజాహక్కులను కాలరాసే విధంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిస్తూ... ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. విపక్ష నేతలను భయపెట్టి, మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.

 టీఆర్ఎస్ కక్ష సాధింపులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ప్రభుత్వాలను గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పని చేసే పార్టీలకే పట్టం కట్టాలని జానారెడ్డి కోరారు. టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు లొంగరని చెప్పారు. టీఆర్ఎస్ పాలనను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

More Telugu News