Hyderabad: ఉపాధ్యాయురాలిని వేధిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న షీ టీమ్!

  • వాట్సాప్ గ్రూపులో పరిచయమైన యువతి
  • వివాహమైందని చెబుతున్నా వినకుండా వేధింపులు
  • అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

హైదరాబాద్, కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని వేధిస్తున్న పోకిరిని షీ టీమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్న కర్నూలు జిల్లాకు చెందిన కె.రామకృష్ణ (32), ప్యాట్నీ సెంటర్ ప్రాంతంలో ఉంటున్నాడు.
 
 టీచర్ గా పనిచేస్తున్న ఓ యువతి ఇతనికి వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయం అయింది. ఆమెతో పరిచయం పెంచుకున్న రామకృష్ణ, తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. తనకు వివాహమైందని బాధితురాలు మొత్తుకుంటున్నా వినలేదు. ఈ క్రమంలో పాఠశాల వద్దకు వచ్చిన రామకృష్ణ, తన వాహనం ఎక్కాలంటూ ఆమె చెయ్యిపట్టుకుని లాగాడు.

అతని ప్రవర్తన మితిమీరడంతో విసుగెత్తిపోయిన బాధితురాలు బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించింది. ఆ వెంటనే పాఠశాల వద్ద మాటు వేసిన షీ టీమ్ బృందం, అతన్ని అరెస్ట్ చేసి, కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించింది. రామకృష్ణను కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. 

More Telugu News