Telangana: హరీశ్‌రావు అంటే ఎంతిష్టమో.. ఉచితంగా క్షవరం చేస్తున్న యువకుడు!

  • హరీశ్‌రావుపై అభిమానంతో ఉచిత క్షవరం
  • సిద్ధిపేట యువకుడి వినూత్న కార్యక్రమం
  • సన్మానం చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు

తెలంగాణలో ఎన్నికల వేడి పూర్తిస్థాయిలో రాజుకోనేలేదు.. అభిమానులు మాత్రం ఆయా పార్టీలపై తమకున్న ‘భక్తి’ని చాటుకుంటున్నారు. టీఆర్ఎస్ అగ్రనేత హరీశ్‌రావు అంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఓ నాయీ బ్రాహ్మణ యువకుడు ఉచితంగా క్షవరం చేసేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో హరీశ్‌రావుకు కనీసం లక్ష ఓట్ల ఆధిక్యం రావాలంటూ సిద్ధిపేటకు చెందిన యువకుడు కొత్వాల్ శ్రీనివాస్ ఈ వినూత్న ప్రచారాన్ని బుధవారం ప్రారంభించాడు.

హరీశ్‌రావుకే ఓటు వేయాలంటూ సొంతంగా ఓ ఫ్లెక్సీని తయారు చేయించిన శ్రీనివాస్.. అందులో ఉచితంగా కటింగ్, షేవింగ్ చేయబడునని రాశాడు. ఆ బోర్డును ఓ ఫుట్‌పాత్‌పై పెట్టి వచ్చీ పోయే వారికి క్షవరం చేస్తున్నాడు. ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత క్షవరం చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని శ్రీనివాస్ తెలిపాడు. తమ సామాజిక వర్గానికి ఎంతోమేలు చేసిన హరీశ్ రావుకు తన వంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నాడు. ఉచిత క్షవర కార్యక్రమం ప్రారంభం సందర్భంగా శ్రీనివాస్‌కు సంఘీభావంగా మరో ముగ్గురు యువకులు కూడా ఉచితంగా క్షవరం చేశారు. వీరందరికీ స్థానిక ప్రజా ప్రతినిధులు సన్మానం చేశారు.  

More Telugu News