Chandrababu: చంద్రబాబు, నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట.. అక్రమాస్తుల పిల్ ను వెనక్కి తీసుకున్న శ్రవణ్ కుమార్!

  • పిల్ దాఖలుచేసిన మాజీ లాయర్ శ్రవణ్ కుమార్
  • నాలుగేళ్లలో రూ.25,000 కోట్లు దోచేశారని ఫిర్యాదు
  • హైకోర్టు సూచనతో పిల్ ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అవినీతికి పాల్పడ్డారంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ప్రజా పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈరోజు విచారణ సందర్భంగా ఫిర్యాదుదారు పిటిషన్ లో సరైన ఆధారాలు సమర్పించలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి ఆధారాలతో మరోసారి పిటిషన్ దాఖలుచేయాలని సూచించింది. దీంతో పిటిషన్ ను  వెనక్కు తీసుకునేందుకు శ్రవణ్ కుమార్ అంగీకరించారు. సమాచార హక్కు చట్టం కింద ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.

గత 4 సంవత్సరాల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ రూ.25,000 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్ లో శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ అక్రమాలపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని కోరారు. ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, తదితరులను చేర్చారు. కంపెనీలకు 57,836 ఎకరాల భూములతో పాటు అనుమతుల జారీలో క్విడ్ ప్రో కో చేటుచేసుకుందని ఆరోపించారు. 

More Telugu News