kannada: ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ కిడ్నాప్ కేసు.. తొమ్మిది మందీ నిర్దోషులేనంటూ తీర్పు!

  • పద్దెనిమిదేళ్ల క్రితం నాటి కేసు తీర్పు
  • నిందితులు వీరప్పన్ మనుషులనేందుకు సాక్ష్యాల్లేవు
  • వారిని నిర్దోషులుగా ప్రకటించిన తమిళనాడు న్యాయస్థానం  

సుమారు పద్దెనిమిదేళ్ల క్రితం ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ ను ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ముఠా కిడ్నాప్ చేసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును తమిళనాడులోని గోబిచెట్టిపాళ్యం జిల్లా న్యాయస్థానం నేడు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వీరప్పన్ మనుషులేనని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.

కాగా, 2000 సంవత్సరం జులై 30న తన ఫామ్ హౌస్ లో రాజ్ కుమార్ ను కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. 108 రోజుల తర్వాత కిడ్నాపర్లు ఆయన్ని వదిలిపెట్టారు. ఈ కిడ్నాప్ నేపథ్యంలో వీరప్పన్, మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్ ను హతమార్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు పలు కారణాల వల్ల మృతి చెందారు.

More Telugu News