kcr: కుటుంబ కలహాలు, కొడుకు, మనవడి ఒత్తిడితో కేసీఆర్ సతమతమవుతున్నారు: వీహెచ్

  • కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి 'సన్' స్ట్రోకే కారణం
  • రోజురోజుకూ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంది
  • బీజేపీతో జతకట్టిన కేసీఆర్ గురించి ముస్లింలు ఆలోచించాలి

అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... సరైన కారణం లేకుండానే పరిపాలనను మధ్యలోనే వదిలేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ రంగంలోకి వచ్చి... ప్రతిపక్షాలతో వేగలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

 ప్రస్తుతం కుటుంబ కలహాలు, కొడుకు, మనవడి ఒత్తిడితో కేసీఆర్ సతమతమవుతున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లడానికి 'సన్' స్ట్రోకే కారణమని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రోజురోజుకూ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని... మహాకూటమి బలపడుతోందని వీహెచ్ అన్నారు. త్వరలోనే మహాకూటమిలోని పార్టీల మధ్య పొత్తులు ఒక కొలిక్కి వస్తాయని చెప్పారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ గురించి ముస్లింలు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు.

More Telugu News