Andhra Pradesh: ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్న చంద్రబాబు.. తెలుగులో ప్రసంగం ప్రారంభం!

  • ఐరాసలో ప్రసంగిస్తున్న చంద్రబాబు
  • ప్రకృతి వ్యవసాయం తీరు తెన్నుల వివరణ
  • అమ్మ జన్మనిస్తే.. భూమి అన్నీ ఇస్తోందన్న బాబు

ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం ప్రసంగం ప్రారంభించారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తొలుత తెలుగులో మాట్లాడడం విశేషం. రసాయన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

మనమంతా రసాయన ఎరువులతో పండించిన పంటలనే తింటున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కలుషితం కాదన్నారు. అంతేకాక, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం తీరుతెన్నులను వివరించారు. అమ్మ జన్మ మాత్రమే ఇస్తే.. భూమి ఆహారం నుంచి అన్నీ ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరు కూడా ఉందన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వల్లే రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు.

More Telugu News