Telangana: ప్రణయ్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటే.. నిరసనకు దిగుతా!: హెచ్చరించిన అమృత

  • కుల హత్యలకు హెచ్చరికగానే ప్రణయ్ విగ్రహం
  • అడ్డుకునేందుకు మా నాన్న అనుచరులు ట్రై చేస్తున్నారు
  • అనుమతుల కోసం అధికారులను కలుస్తానన్న అమృత

మిర్యాలగూడ పరువు హత్య కేసులో ప్రణయ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుల హత్యలను నివారించేందుకు వీలుగా, ఓ హెచ్చరికగా మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అతని భార్య అమృత డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలువురు ర్యాలీ నిర్వహించారు. ప్రణయ్ విగ్రహాన్ని సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోవాలనీ, ఇలా కూడలిలో ఏర్పాటు చేస్తే తప్పుడు సందేశం వెళుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అమృత స్పందించింది.

తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేసేందుకు, భవిష్యత్ లో కుల హత్యలు జరగకుండా హెచ్చరించాలన్న ఉద్దేశంతో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని అమృత తెలిపింది. ఈ విగ్రహ ఏర్పాటు పనులను తన తండ్రి మారుతీరావు అనుచరులు అడ్డుకుంటున్నారని వెల్లడించింది. త్వరలోనే ఈ విషయమై అధికారులను సంప్రదించి అనుమతులు కోరతానని చెప్పింది. అడ్డంకులు ఎదురైతే విగ్రహ ఏర్పాటు స్థలంలోనే నిరసనకు దిగుతానని హెచ్చరించింది.

More Telugu News