ALCOHOL: మందు కొట్టడం కారణంగా 30 లక్షల మంది చనిపోయారు!: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మందుబాబులు
  • వీరిలో 28 కోట్ల మంది మద్యానికి బానిసలయ్యారు
  • మద్యం కారణంగా కేన్సర్ వస్తోంది

సాధారణంగా కొందరు మద్యాన్ని మితంగా పుచ్చుకుంటే మరికొందరేమో పూటుగా తాగేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కేవలం తమనే కాకుండా కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తారు. తాజాగా మందుబాబులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సంచలన విషయాన్ని బయటపెట్టింది.

పూటుగా మద్యం సేవించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2016లో ఏకంగా 30 లక్షల మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది మద్యం తాగుడుకి అలవాటు పడ్డారని.. వీరిలో 23.7 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది స్త్రీలు దానికి బానిసలై ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. మద్యం తీసుకోవడంతో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది.

ఇలా మద్యానికి బానిసై ఇబ్బంది పడుతున్న వారిలో అమెరికా, యూరప్ ప్రజలు గణనీయంగా ఉన్నారని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఇక మద్యం సేవించేవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, కేన్సర్, మానసికస్థితి సరిగా లేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యసనాన్ని తక్షణం నివారించే అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా మద్యం తీసుకునే వారు సగటున రోజుకు 2 గ్లాసుల వైన్‌, ఓ పెద్ద బీరు బాటిల్‌, రెండు స్పిరిట్‌ షాట్లు తాగుతున్నారని నివేదిక తెలిపింది.

More Telugu News