Anantapur District: అనంతపురం జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గీయుల ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు!

  • పుట్లూరు మండలంలో ఘటన
  • ప్రభుత్వ స్థలంలో టీడీపీ వర్గీయుల షాపు ఏర్పాటు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ స్థలంలో దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, బాటిళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పుట్లూరు మండలంలోని కుమ్మనమలలో బస్టాండ్ ముందు టీడీపీ వర్గీయులు ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచాయితీ స్థలంలో షాపు పెట్టడం ఏంటని వైసీపీ నేతలు నిలదీశారు. ఇరువర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలు, బాటిళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీకి చెందిన రామాంజనేయులు, బయన్న, వైసీపీకి చెందిన హరిబాబు, శంకర్‌, రామాంజినేయులు, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్డీఓ మలోల పంచాయితీ స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించారు. కాగా ప్రభుత్వ స్థలంపై ఘర్షణ జరగడం, అప్పటివరకూ రెవిన్యూ సిబ్బంది పట్టించుకోకపోవడంపై కలెక్టర్ వీరపాండ్యన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News