madhavi: మాధవిని కత్తితో నరుకుతుంటే చూడలేకే మనోహరాచారిని ఎగిరి తన్నాను!: యువకుడు అసద్ వెల్లడి

  • ఎర్రగడ్డ వద్ద కత్తితో దాడిచేసిన మనోహరాచారి
  • దారుణం చూడలేక అడ్డుకున్నానన్న యువకుడు
  • పోలీసుల విచారణ భయంతో వెనుకంజ

కులాంతర వివాహం చేసుకున్నందుకు ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ వద్ద కుమార్తె మాధవి, అల్లుడు సందీప్ పై మనోహరాచారి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సందీప్ స్వల్ప గాయాలతో బయటపడగా, మాధవి ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. అయితే సందీప్ దంపతులపై దాడి జరిగిన సమయంలో ఎవ్వరూ ముందుకు రాకపోగా, ఓ యువకుడు మాత్రం మనోహరాచారిని వెనుక నుంచి బలంగా తన్నాడు. దీంతో సదరు యువకుడిపై దాడికి యత్నించిన మనోహరాచారి, ఆ తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. తాజాగా మనోహరాచారిపై దాడిచేసిన యువకుడు అసద్ మీడియాతో మాట్లాడాడు.

ఎర్రగడ్డ గుల్షన్‌ నూర్‌బాగ్‌ బస్తీకి చెందిన అసద్‌ స్థానికంగా పాలిషింగ్ రాళ్లు పరిచే పనిచేస్తుంటాడు. ఖాళీ సమయాల్లో గోకుల్ థియేటర్ సమీపంలోని బాటా షోరూం వద్ద స్నేహితులతో కలిసి గడుపుతుంటాడు. బుధవారం పని నుంచి వచ్చాక స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు అసద్ అక్కడకు చేరుకున్నాడు. అప్పుడు హ్యూందాయ్ షోరూమ్ వద్ద కుమార్తె మాధవిపై కత్తితో దాడిచేస్తున్న మనోహరాచారిని చూసిన అసద్ ఒక్కసారిగా బైక్ నుంచి దిగి అతడిని ఎగిరి తన్నాడు. దీంతో మరికొందరు అసద్ కు తోడయ్యారు. ఈ సందర్భంగా దొరికిపోతానని భయపడ్డ మనోహరాచారి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వ్యవహారంలో పోలీస్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో అసద్ ముందుకు రాలేదు.

ఈ విషయమై అసద్ మీడియాతో మాట్లాడుతూ.. కళ్ల ముందు ఓ యువతిని నరుకుతుంటే చూడలేకే తన్నానని తెలిపాడు. తనపై దాడి చేస్తాడన్న భయంతో వెనక్కు తగ్గానని వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఏవీ తనకు తెలియదని వ్యాఖ్యానించాడు.

More Telugu News