UNO: న్యూజెర్సీలో చంద్రబాబు బహిరంగ సభ.. 25న ఐరాసలో ఆంధ్రుల వాణిని వినిపించనున్న సీఎం!

  • నేటి రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికాకు పయనం 
  • 23న న్యూజెర్సీలో బహిరంగ సభ 
  • 25న ఐరాసలో ప్రసంగం  

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో  ప్రపంచ ఆర్థిక వేదిక బ్లూంబెర్గ్‌ నిర్వహించే ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు నేడు అమెరికా వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం 25వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు చంద్రబాబు ఐరాసలో ప్రసంగిస్తారు.

పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. అలాగే, ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎలా ఎదిగిందీ వివరించనున్నారు.  23 నుంచి 26 వరకు అమెరికాలో పర్యటించనున్న చంద్రబాబు తిరిగి 28న స్వదేశానికి తిరిగి రానున్నారు.

ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా పలువురు పెట్టుబడిదారులు , పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో భేటీ కానున్నారు. కాగా,  ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, భవిష్యత్ లక్ష్యాలను అక్కడ వివరిస్తారు.

More Telugu News