Telangana: తీరం దాటిన 'దాయే' తుపాను... తడిసి ముద్దవుతున్న ఉత్తర తెలంగాణ!

  • కళింగపట్నం - పూరీ నడుమ తీరం దాటిన తుపాను
  • పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
  • గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న 'దాయే'

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'దాయె', గురువారం రాత్రి కళింగపట్నం - పూరి నడుమ తీరం దాటగా దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న తుపాను గోపాల్ పూర్ కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నానికి ఈశాన్యంగా 165 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, ఇది క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దీని ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలోని మంచిర్యాల, కొమురం భీమ్, ఆదిలాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల్లో గత రాత్రి నుంచి వానలు దంచికొడుతున్నాయి. గత రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవగా, ఆకాశం మేఘావృతమై ఉంది. సముద్రంలో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అధికారులు, మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంతంలో పలు చోట్ల 100 మీటర్ల వరకూ సముద్రం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News