Telangana: కేసీఆర్ ఇంత అవివేకా? అనిపిస్తోంది: కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు

  • ముందస్తు ఓ చెత్త ఆలోచన
  • ప్రత్యేక రాష్ట్రంతో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే
  • ఉద్యమ ఆకాంక్షల సాధనే అజెండాగా పొత్తులు

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఎంతో పెద్ద అవివేకిలా తనకు కనిపిస్తున్నారని, ఇంత చెత్త ఆలోచనను ఆయన ఎందుకు చేశారోనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెరాసా పాలనలో ప్రజల గోడు వినేవారు కరవయ్యారని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావడంతో బాగుపడింది ఒక్క కేసీఆర్ కుటుంబమేనన్న భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. తమకు పైసలిచ్చేవాడు వద్దని, పనిచేసేవాడు కావాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ జన సమితి పార్టీ దెబ్బతినేలా పొత్తులు ఉండవని, ఉద్యమ ఆకాంక్షల సాధనే అజెండాగా పొత్తుల విషయంలో ముందడుగు వేస్తామని అన్నారు. గతంలో టీఆర్ఎస్ అంటే ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం ఇప్పుడు లేదని అభిప్రాయపడ్డ ఆయన, కేసీఆర్ ఒక్కరికే సొంతం రాష్ట్రం వచ్చిందని అనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఏ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి విజయం సాధించామో, ఆ లక్ష్యం నెరవేరనందునే, టీజేఎస్ పార్టీని ప్రారంభించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసే పనిలో ఉన్నామని కోదండరామ్ అన్నారు.

More Telugu News