amrutha: సోషల్ మీడియాలో మారుతీరావు మద్దతుదారుల కామెంట్లు!

  • ప్రణయ్ హత్యపై మిశ్రమ స్పందన
  • పెరుగుతున్న మారుతీరావు మద్దతుదారులు
  • అమృతలాంటి కూతురుని కన్నందుకు ఉరే సరి

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య చాలా విషయాలను తెరపైకి తీసుకువస్తోంది. పరువు హత్యగా పేర్కొన్న దీనిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ హత్య  జరిగినప్పటి నుంచి ప్రణయ్, అతని భార్య అమృతకు సోషల్ మీడియాలో బాగా మద్దతు వచ్చింది. తాజాగా అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతీరావుకు కూడా విపరీతంగా మద్దతు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కన్నతండ్రి దృష్టి కోణంతో చూసిన పలువురు ఆయనకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు ‘జై మారుతీరావు.. జై మారుతీ సేన’ అంటూ కొందరు ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మారుతీరావు ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు. తన తండ్రిని ఉరితీయాలన్న అమృత వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు.

ఆమె వ్యాఖ్యలపై ‘‘అవును. నీ తండ్రిని ఉరి తీయాల్సిందే. నీలాంటి కూతురిని కనడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అందుకు చంపాల్సిందే. నీ తండ్రిని నువ్వు ఎన్ని సంవత్సరాలుగా మానసిక క్షోభకు గురిచేశావో నీకు తెలుస్తుందా? అమృత చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమెకేదో పెద్ద ఎజెండానే ఉన్నట్టుంది’’ అని మారుతీరావు మద్దతుదారుడు ఒకరు పోస్ట్ పెట్టారు.

‘తమకు ఆడపిల్లైతే పుట్టాలని, కానీ అమృత లాంటి ఆడపిల్ల వద్దు’ అంటూ కొందరు పోస్ట్ పెడుతుంటే.. ‘9వ తరగతిలో ప్రేమా..? ఆ వయసు ప్రేమించేందుకు తగినదేనా.. అది ప్రేమకాదు ఆకర్షణ. అమృత విషయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు’ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనిపై సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News