Hyderabad: మాధవి, సందీప్ లపై దాడి చేయడానికి నా భార్యే కారణం!: మనోహరాచారి

  • నాకు చెప్పుంటే నేనే పెళ్లి చేసేవాడిని
  • మాధవి బతకాలని కోరుకుంటున్నా
  • భయపెట్టాలని మాత్రమే అనుకున్నా

తన ప్రేమ విషయాన్ని మాధవి చెప్పి ఉంటే తానే సందీప్ తో ధూమ్ ధామ్ గా పెళ్లి చేసేవాడినని నిందితుడు మనోహరాచారి తెలిపాడు. తనకు చెప్పకుండా కుమార్తె పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది దాడి చేశానని చెప్పాడు. ఇప్పుడు తనకు ఎవరిపైనా కోపం లేదనీ, మాధవి బతకాలని కోరుకుంటున్నానని అన్నాడు.

మద్యం మత్తులో తొందరపడి కూతురు మాధవి, అల్లుడు సందీప్ పై దాడిచేశానని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి వాళ్లిద్దరినీ భయపెట్టాలని మాత్రమే అనుకున్నానని చెప్పాడు. ఈ రోజు పోలీసులు ఏసీపీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకెళుతుండగా మనోహరాచారి మీడియాతో మాట్లాడాడు.

తాను రోడ్డుమీద వ్యాపారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రోజుకి ఏభై సంపాదించినా, వంద సంపాదించినా.. అంతా తన కుమార్తె మాధవి కోసమే ఖర్చు పెట్టానని తెలిపాడు. కానీ పెళ్లి విషయంలో మాత్రం తనకు చెప్పకుండా మోసం చేసిందని వాపోయాడు. తాను మాధవి-సందీప్ లపై దాడి చేయడానికి తన భార్యే కారణమని మనోహరాచారి ఆరోపించాడు.

అసలు కుమార్తెపై దాడి చేసే బదులు తన భార్యను చంపేసి ఉంటే సరిపోయేదని వ్యాఖ్యానించాడు. మాధవి కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను తొందరపడి తప్పు చేశానని అంగీకరించాడు. తన అల్లుడు చాలా మంచివాడన్నాడు. మాధవి ప్రేమ విషయం ఇంట్లో అందరూ తన దగ్గర దాచిపెట్టారన్నాడు.

More Telugu News