kcr: కేసీఆర్ ఒక చీటర్.. దేశంలో అబద్ధాలు చెప్పే ఏకైక సీఎం ఆయనే!: గులాం నబీ అజాద్

  • తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నారు
  • ఢిల్లీలో మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తారు.. తెలంగాణలో బీజేపీని తిడతారు
  • తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక చీటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని... అతని చీటింగ్ అక్కడి నుంచే మొదలైందని దుయ్యబట్టారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ... తెలంగాణలో బీజేపీని తిడుతూ... ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం కోసం తమ ఎంపీలు అప్పట్లో పార్లమెంటును స్తంభింపజేశారని అజాద్ చెప్పారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం పోరాటం చేశారని అన్నారు. ఢిల్లీలో, రాష్ట్రంలో స్టేట్ మెంట్లను ఇవ్వడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు. టీఆర్ఎస్ దారుణమైన పాలనను చూసి తెలంగాణ ప్రజలు మేల్కొని ఉంటారని అన్నారు. దేశం మొత్తం మీద అబద్ధాలు చెప్పే, తప్పుడు ప్రకటనలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆరేనని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరడం ఎంఐఎం నైజమని ఎద్దేవా చేశారు.

More Telugu News