More: 'మోర్' ఇక అమెజాన్ సొంతం... డీల్ విలువ రూ. 4,200 కోట్లు

  • 99.99 శాతం వాటాలను కొన్న ఎస్ఏఐఎఫ్, అమెజాన్
  • రిటైల్ స్టోర్లను నడిపించనున్న అమెజాన్
  • దేశవ్యాప్తంగా 575 మోర్ సూపర్, హైపర్ మార్కెట్లు

ఆదిత్య బిర్లా గ్రూప్‌ నకు చెందిన రిటైల్‌ వ్యాపార కంపెనీ 'మోర్' అమెజాన్ పరం కానుంది. మోర్ లో 99.99 శాతం వాటాను దేశీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పిఇ) పెట్టుబడుల సంస్థ సమారా ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్ మెంట్స్ ఫండ్‌ (ఎస్ఏఐఎఫ్), అమెరికా ఆన్‌ లైన్‌ దిగ్గజం అమెజాన్‌ లు కొనుగోలు చేశాయి. ఇండియాలో ఎఫ్డీఐ నిబంధల ప్రకారం, ఏదైనా బహుళ ఉత్పత్తుల రిటైల్‌ బ్రాండ్ల సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 49 శాతానికి మించడానికి వీల్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అమెజాన్, ఎస్ఏఐఎఫ్ తో చేతులు కలిపి మోర్‌ రిటైల్‌ చెయిన్‌ ను కొనుగోలు చేసింది. టెక్నికల్ గా ఈక్విటీలో మోజారిటీ వాటా సమారాకే ఉన్నప్పటికీ, పరోక్షంగా అమెజానే ఈ రిటైల్‌ స్టోర్లను నడిపించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 575 మోర్‌ సూపర్‌ మార్కెట్‌, హైపర్‌ మార్కెట్‌ స్టోర్లు ఉన్నాయి.

కాగా, ఈ డీల్ విలువ రూ. 4,200 కోట్లని తెలుస్తోంది. నిన్న జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ ఆర్కేఎన్ రిటైల్ లిమిటెడ్ బోర్డు సమావేశం ఈ డీల్ కు ఓకే తెలిపింది. (సీసీఐ) కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సహా ఇతర రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తర్వాత కొనుగోలు, వాటాల బదిలీ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఇటీవలి కాలంలో ఇండియా ఆఫ్‌ లైన్‌ రిటైల్‌ మార్కెట్లో అమెజాన్‌ కు ఇది రెండో భారీ పెట్టుబడి. 2017 సెప్టెంబర్ లో షాపర్స్‌ స్టాప్‌ లో 5 శాతం ఈక్విటీని రూ. 180 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్‌ లో రూ. 500 కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ గతంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంతవరకూ 384 కోట్ల డాలర్లు (సుమారు రూ. 25,220 కోట్లు) ఆయన ఇప్పటికే ఇండియాకు తరలించారు.

More Telugu News