Malya: విజయ్ మాల్యా హెలికాప్టర్లను వేలం వేసి రూ. 8.75 కోట్లు రికవరీ చేసుకున్న బ్యాంకులు!

  • రూ. 9 వేలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన మాల్యా
  • వేలం వేసిన డీఆర్టీ-1
  • కొనుగోలు చేసిన చౌదరి ఏవియేషన్

ఇండియాలోని బ్యాంకులకు సుమారు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టి, బ్రిటన్ కు పారిపోయి తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చీఫ్ విజయ్‌ మాల్యా హెలికాప్టర్లను వేలం వేసిన 17 బ్యాంకుల కన్సార్టియం, రూ. 8.75 కోట్లను రికవరీ చేసుకుంది. బెంగళూరులోని డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ-1), ఆన్ లైన్ విధానంలో వేలం వేయగా, రెండు హెలికాప్టర్లను ఢిల్లీకి చెందిన చౌదరి ఏవియేషన్‌ కొనుగోలు చేసింది. ఒక్కోటి రూ. 4.37 కోట్ల ధర పలికిందని, చౌదరి ఏవియేషన్‌ డైరెక్టర్‌ సత్యేంద్ర సెహ్రావత్ వెల్లడించారు.

2007 నుంచి 2012 మధ్య తమ సంస్థల పేరిట తీసుకున్న రూ. 9 వేల కోట్లకు పైగా రుణాన్ని చెల్లించడంలో విఫలమైన మాల్యా, 2016లో దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ 5 సీట్ల ఎయిర్‌ బస్‌ యూరోకాప్టర్‌ బీ155 హెలికాప్టర్లలో రెండు ఇంజన్ లు ఉన్నాయని, ఇవి పదేళ్ల కాలం నాటివని సత్యేంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం వీటిని ముంబైలోని జుహు ఎయిర్‌ పోర్ట్‌ లో పార్క్‌ చేసి ఉంచామని అన్నారు. తమ సంస్థ ఎయిర్ అంబులెన్స్ సేవలను అందిస్తోందని, వీటిని ఎలా వాడాలన్న విషయమై ఇంకా ఆలోచించలేదని తెలిపారు.

More Telugu News