Telangana: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి హత్యకు కుట్ర.. డ్రోన్లతో నిఘా పెట్టిన దుండగులు!

  • ఈ నెల 2న నాగారంలో డ్రోన్లతో సర్వే
  • గతంలో మంత్రిపై జరిగిన హత్యాయత్నం
  • గ్రామస్తులతో కలిసి ఉండగా చంపాలని ప్లాన్

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామమైన నాగారంకు మంత్రి తరచుగా వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా గ్రామస్తులతో కలిసిపోతారు. ఈ నేపథ్యంలో మంత్రి హత్యకు కొందరు దుండగులు స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఈ నెల 2న కొందరు వ్యక్తులు నాగారంలోని వీధులు, ఇళ్లను డ్రోన్లతో చిత్రీకరించారని పేర్కొన్నాయి.

స్వగ్రామానికి మంత్రి వచ్చినప్పుడు హత్యచేసి పరారవ్వాలని దుండగులు ప్లాన్ చేసినట్లు సమాచారం. దాదాపు ఏడాది క్రితం జగదీశ్ రెడ్డి సూర్యాపేటకు వస్తుండగా ఆయన కాన్వాయ్ లోని కారును ఓ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ వ్యాన్ తో సహా డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో జగదీశ్ రెడ్డి మరో కారులో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రిని చంపేందుకు మరోసారి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం అందిందని మీడియాకు ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

More Telugu News