Congress: నిధుల వేటలో కాంగ్రెస్‌ పార్టీ : రూ.500 కోట్ల సమీకరణకు నిర్ణయం

  • గడపగడపకూ వెళ్లి అడగాలని వ్యూహరచన
  • ప్రతి బూత్‌ కమిటీ ఆధ్వర్యంలో రూ.5 వేలు వసూలు లక్ష్యం
  • ఈ మేరకు కార్యదర్శులకు ఆదేశాలు జారీ

సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నిధుల వేటలో పడింది. కనీసం రూ.500 కోట్లు సేకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైతే గడపగడపనూ సందర్శించాలని, 5, 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి బూత్‌ కమిటీ ఆధ్వర్యంలో కనీసం ఐదువేల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశిస్తూ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.

పార్టీ ఎన్నడూ లేని విధంగా నిధుల లేమితో సతమతమవుతోందని సమాచారం. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో ఇది ఇబ్బందికరమని భావించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.250 నుంచి రూ.10 వేల వరకు విరాళం ఇవ్వాలని ప్రతినిధులు, ప్రజలకు పార్టీ విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉంచితే, ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున పారదర్శకత, జవాబుదారీతనంగా జరిగేలా ఆదేశించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ అనంతకుమార్‌ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు ఎన్నికల కమిషన్‌ కౌంటర్‌ దాఖలు చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన తమ సంస్థ పనిలో కాంగ్రెస్‌ పార్టీ జోక్యం చేసుకోవడం తగదని, అందువల్ల వారు వేసిన పిటిషన్‌ ను తిరస్కరించాలని కోరింది. 

More Telugu News