Telangana: మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్ ఇచ్చి మహిళపై లైంగిక దాడి!

  • ఉద్యోగం వచ్చిందని నమ్మించి పార్టీ పేరుతో వంచన
  • బాధితురాలు ఆర్టీసీ ఉద్యోగి భార్య
  • భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కోసం దరఖాస్తు

భర్తపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆమె ఉద్యోగం వస్తే ఓ ఆసరా లభిస్తుందని ఆశపడింది.  దరఖాస్తు చేయగానే ఆమెపై ఓ కామాంధుడి కళ్లు పడ్డాయి. యూనియన్‌ నాయకుడిగా ఆమెకు దగ్గరయ్యాడు. ఉద్యోగం వచ్చిందని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ పరిధి బోడుప్పల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. 

బోడుప్పల్‌ పీవీఆర్‌ రెసిడెన్సీలో ఉండే శ్యాంసుందర్‌రెడ్డి జీడిమెట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తనకు ఉపాధి చూపాలని అతని భార్య (28) ఆర్టీసీ అధికారులను కోరింది. ఇందుకోసం ఆమె తిరుగుతుండగా చెంగిచెర్ల డిపో డ్రైవర్‌, డిపో టీఎంయూ కార్యదర్శి సోమసాయలు (48) పరిచయం అయ్యాడు. యూనియన్‌ నాయకుడిగా దగ్గరయ్యాడు. ఉద్యోగం కోసం ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించి తీసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ఒక రోజు ఉద్యోగం వచ్చిందని నమ్మబలికి నకిలీ ధ్రువపత్రం ఆమె చేతిలో పెట్టాడు. పార్టీ ఇవ్వాలని కోరాడు. నిజమేనని నమ్మిన ఆమె ఇంట్లో విందు ఏర్పాటుచేసి ఆహ్వానించింది. సాయిలు తాను మద్యం సేవిస్తూ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. మత్తులోకి వెళ్లాక లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఆ తర్వాత పలుమార్లు బెదిరించి ఆమెను లోబర్చుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

More Telugu News