Tamil Nadu: పెట్రోలు ధరలపై బీజేపీ అధ్యక్షురాలిని ప్రశ్నించిన ఆటో డ్రైవర్.. ఈడ్చుకెళ్లి చావబాదిన బీజేపీ నేత!

  • పెట్రో ధరలపై ప్రశ్నించిన ఆటో డ్రైవర్
  • ఈడ్చి పడేసి చెంపలు వాయించిన బీజేపీ నేతలు
  • వైరల్ అవుతున్న వీడియో

పెట్రోలు ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఓ ఆటోడ్రైవర్‌ను బీజేపీ నేతలు చావబాదారు. తమిళనాడులో జరిగిందీ ఘటన. సైదాపేటలో బీజేపీ తమిళనాడు చీఫ్ తమిళసై సౌందర రాజన్ విలేకరులతో మాట్లాడుతుండగా ఖాకీ డ్రెస్‌తో వచ్చిన ఓ ఆటో రిక్షా డ్రైవర్ పెట్రోలు ధరల పెరుగుదలపై ఆమెను ప్రశ్నించాడు. ప్రశ్న విన్న తమిళసై చిన్నగా నవ్వడం వీడియోలో కనిపించింది.  ఆ వెంటనే బీజేపీ నేతలు, మద్దతుదారులు ప్రశ్న అడిగిన ఆటో డ్రైవర్‌ను పక్కకు లాగేసి దాడి చేశారు. చెంపలు పగలగొట్టారు.

బాధితుడు కాథిర్ (49) మాట్లాడుతూ తనో ఆటో డ్రైవర్‌నని, పెట్రోలు ధరలు పెరగడంతో తన జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి తమిళసై మాట్లాడుతుండడంతో తాను కూడా ప్రశ్న అడగవచ్చని భావించి అడిగానని చెప్పుకొచ్చాడు. తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తనపై దాడిచేశారని, చెంపలు వాచిపోయాయని చూపించాడు. కాథిర్‌పై బీజేపీ నేతలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

More Telugu News