New Delhi: ఢిల్లీలో యువతిని చావబాదిన కేసులో యువకుడి తండ్రిపై వేటు!

  • ఇటీవల సంచలనమైన వీడియో
  • ఓ బీపీవోలో యువతిపై దాడి చేసిన పోలీసు అధికారి కుమారుడు
  • సస్పెండ్ చేసిన అధికారులు

ఢిల్లీలో పోలీసు అధికారి కుమారుడు ఒకరు ఓ యువతిని అందరూ చూస్తుండగానే ఇష్టం వచ్చినట్టు దాడి చేసిన వీడియో ఇటీవల వైరల్ అయింది. యువతి జుట్టు పట్టుకుని కడుపులో తంతూ, చిత్రహింసలకు గురిచేయడం సంచలనమైంది. యువకుడు రోహిత్ తోమర్ తండ్రి  అశోక్ సింగ్ తోమర్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్. తండ్రి అండ చూసుకునే అతడు రెచ్చిపోయినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ తోమర్ తనపై అత్యాచారం చేశాడని, దీనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతోనే తనపై దాడిచేశాడని 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో తన స్నేహితుడు నిర్వహిస్తున్న బీపీవోకు యువతిని పిలిపించుకున్న రోహిత్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో చావబాదాడు. రోహిత్ స్నేహితుడు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అంతేకాదు, ఈ వీడియోను తన మాజీ గాళ్ ఫ్రెండ్‌కు పంపిన రోహిత్ ఆమెకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు.

ఈనెల 11న రోహిత్ తన ఇంటికి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని రోహిత్ మాజీ గాళ్ ఫ్రెండ్ ఆరోపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆయన తండ్రి అశోక్ సింగ్ తోమర్‌కు ఫోన్ చెప్పగా ఆయన కూడా అసభ్యంగా మాట్లాడాడని పేర్కొంది. తాను అసభ్యంగా ఉన్న ఫొటోలు ఆయన వద్ద ఉన్నాయని చెబుతూ బెదిరించాడని తెలిపింది. దీంతో ఆమె అదే రోజు రోహిత్, అశోక్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News