Air India: ఇంధనం లేకుండా గాల్లో చిక్కుకున్న ఎయిరిండియా విమానం.. 370 మంది ప్రయాణికులు సేఫ్!

  • ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానం
  • విమానంలో పలు వ్యవస్థలు ఫెయిల్
  • ఏటీసీ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ఢిల్లీ నుంచి 370 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వెళ్లిన ఎయిరిండియా బోయింగ్ 777-330 విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. కొంచెం అటూ ఇటు అయి ఉంటే 370 మంది ప్రాణాలు గాల్లో కలిసేవే. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సత్వరం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

సెప్టెంబరు 11న ఈ ఘటన జరగ్గా తాజాగా పైలట్-ఏటీసీకి మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. వాతావరణం అస్సలు బాగాలేదని, విమానంలో ఇంధనం కూడా నిండుకుందని, వెంటనే ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరాడు. దీంతో అప్రమత్తమైన ఏటీసీ న్యూయార్క్‌లోని మరో విమానాశ్రయాన్ని ల్యాండింగ్‌కు సిద్ధం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

విమానంలోని మూడు రేడియో ఆల్టిమీటర్లలో రెండు, టి-కాస్ సిస్టం, ఆటో ల్యాండ్ ఫీచర్లు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. టీ-కాస్ సిస్టం అనేది విమానంలో చాలా ముఖ్యమైన వ్యవస్థ. విమానం గాల్లో ఉండగా, అదే మార్గంలో మరో విమానం వస్తున్నప్పుడు కాక్‌పిట్‌లోని పైలట్లను ఇది హెచ్చరిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ ఫెయిలై, విమానంలో ఇంధనం కూడా నిండుకోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు.

ఎయిర్‌క్రాఫ్ట్ లోని వ్యవస్థలు గ్రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్‌తో అనుసంధానం కావడంలో విఫలమయ్యాయి. దీంతో అతి కష్టం మీద ఏటీసీని సంప్రదించిన పైలట్లు ల్యాండింగ్‌కు అనుమతి కోరడంతో ప్రత్యామ్నాయంగా న్యూయార్క్‌లోనే ఉన్న లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News