Amruta Varshini: అమృత వర్షిణి తల్లిపై ప్రణయ్ తల్లి సంచలన ఆరోపణలు!

  • రెండు వారాల ముందు నుంచి ఫోన్స్
  • నల్లపూసల గొలుసు చేయించానని నమ్మబలికింది
  • వివరాలు అడిగి హత్యకు కుట్ర చేసిన అమృతరావు, అతని భార్య
  • ప్రణయ్ తల్లి ప్రేమలత ఆరోపణ

అమృత వర్షిణి తండ్రి మారుతీరావుతో పాటు తల్లి కూడా కలసి కుట్ర చేసి, తన బిడ్డను చంపించారని గత శుక్రవారం పరువుహత్యకు గురైన ప్రణయ్ తల్లి ప్రేమలత సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు రెండు వారాల ముందు నుంచి అమృత వర్షిణికి ఫోన్ చేయడం ప్రారంభించిన ఆమె తల్లి, మెత్తగా, నమ్మకంగా మాట్లాడి, వారి గురించి ఆరా తీశారని ఆరోపించారు. నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ, వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి, తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ప్రేమలత అన్నారు.

వర్షిణి అంగీకరిస్తే ఆమెను తీసుకువెళ్లచ్చని తాము మారుతీరావుకు స్పష్టంగా చెప్పామని అన్నారు. తన కూతురుకు చీమైనా కుట్టకుండా చూసుకుని తన కొడుకును దారుణాతి దారుణంగా మారుతీరావు చంపించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి చెప్పారు. ప్రణయ్, అమృత హైస్కూల్ వయసులోనే ప్రేమించుకున్నారని, తనకు విషయం తెలిసి ప్రణయ్ ని పలుమార్లు కొట్టానని చెప్పిన ఆయన, వారిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చి కాళ్లపై పడి, వేడుకున్నారని కన్నీటితో గుర్తు చేసుకున్నారు.

More Telugu News