Hyderabad: హైదరాబాద్ లో దారుణం... అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త!

  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • గత సంవత్సరం సిరాజ్, అసిమాలకు వివాహం
  • అప్పటి నుంచి వేధిస్తున్న సిరాజ్
  • హత్య చేసి పరారీలో... కేసు నమోదు చేసిన పోలీసులు

తాను కోరిన అదనపు కట్నం తీసుకురావడం లేదన్న ఆగ్రహంతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేశాడో దుర్మార్గుడు. హైదరాబాద్ లోని జూబ్సీహిల్స్ పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, సనత్ నగర్ కు చెందిన వెల్డర్ సిరాజ్ కు కృష్ణానగర్ కు చెందిన అసీమాతో గత సంవత్సరం వివాహం జరిగింది. ఆ సమయంలో రూ. 1.50 లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ. 50 లక్షల విలువైన ప్లాట్ ను కట్నంగా ఇచ్చారు. ఆ ప్లాట్ అసిమా పేరిట ఉండటంతో తన పేరిట మార్చాలని, అదనంగా మరింత కట్నం ఇవ్వాలని గత కొంతకాలంగా వేధింపులకు దిగాడు. గత నెలలో ఆమెను కొట్టి ఇంటి నుంచి తరిమేయడంతో, పుట్టింటికి వచ్చిన అసీమాకు సర్దిచెప్పి, అల్లుడిని ఒప్పించి, తిరిగి కాపురానికి పంపారు.

ఈ క్రమంలో భార్యతో మంచిగా ఉన్నట్టు నటిస్తున్న సిరాజ్, నిన్న రాత్రి ఇంట్లో మామ, బావ మరిది, మరదళ్లు నిద్రిస్తుండగా, వారి గదులకు తాళం పెట్టి, భార్య గొంతును కత్తితో కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మరణించింది. ఆపై సనత్ నగర్ లోని తన ఇంటికి వెళ్లిన సిరాజ్, తల్లిదండ్రులను తీసుకుని పరారయ్యాడు. ఉదయం గది బయట తలుపు వేసి ఉండటంతో గమనించిన సిరాజ్ మామ అస్లాంఖాన్, పక్కింటి వారికి ఫోన్ చేసి బయటకు వచ్చి చూడగా, అసీమా మృతదేహం కనిపించింది. దీంతో అస్లాంఖాన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితుడు సిరాజ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ సనత్ నగర్ వరకూ వెళ్లి కట్ అయ్యాయని గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News