Guntur: గుర్రపు పందాలలో డబ్బు పోగొట్టుకుని, గుండెపోటుతో మృతి చెందిన తెనాలి వ్యక్తి!

  • గుంటూరు పెదకాకాని రోడ్డులో గుర్రపు పందాల క్లబ్
  • రూ. 60 వేలు పోగొట్టుకున్న శ్రీధర్
  • కుప్పకూలి అక్కడికక్కడే మృతి

గుంటూరు నగరంలోని పెదకాకాని రోడ్డులోని ఆటోనగర్ లో ఉన్న హెచ్ఆర్సీ గుర్రపు పందాల క్లబ్‌ లో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ ఆడేందుకు వచ్చి, డబ్బు పోగొట్టుకున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గత కొన్నేళ్లుగా ఇక్కడ హార్స్ రేసింగ్ క్లబ్ నడుస్తుండగా, నిత్యమూ లక్షల్లో డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారు తమ డబ్బును కాయిన్లుగా మార్చుకుని పందేలు కాస్తుంటారు.

ఈ క్రమంలో తెనాలి తాలూకా చినరావూరుకు చెందిన శ్రీధర్ అలియాస్ రమేష్ పందేలు కాసేందుకు వచ్చాడు. పందెంలో పాల్గొని నిమిషాల వ్యవధిలో ఏకంగా రూ. 60 వేలను పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపంతో ఉన్న ఆయనకు గుండెపోటు రాగా, అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక్కడ జరుగుతున్న గుర్రపు పందాల్లో డబ్బులు పోగొట్టుకుని అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని స్థానికులు వాపోతున్నారు.

More Telugu News