Asia Cup: కోహ్లీ లేకుంటే ఎలా?... బీసీసీఐతో గొడవకు దిగిన స్టార్ స్పోర్ట్స్!

  • ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్
  • విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగుతున్న టీమిండియా
  • వాణిజ్యపరంగా నష్టపోతామని వాపోతున్న స్టార్ స్పోర్ట్స్

ప్రస్తుతం దుబాయ్ లో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో విశ్రాంతి పేరిట కెప్టెన్ విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోకపోవడాన్ని టోర్నీ ప్రసార హక్కులను తీసుకున్న స్టార్ స్పోర్ట్స్ తీవ్రంగా తప్పుబడుతోంది. కోహ్లీ ఆడకుంటే, మ్యాచ్ లకు జనాదరణ తగ్గుతుందని, టీవీల ముందు కూర్చుని చూసేవారి సంఖ్య పడిపోతుందని, ఈ కారణంతో తాము వాణిజ్య పరంగా నష్టపోతామని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం, బీసీసీఐతో గొడవకు దిగినట్టు తెలుస్తోంది.

ఈ టోర్నీలో అత్యుత్తమ జట్టును ఆడిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ హామీ ఇచ్చిన మీదటే, భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి హక్కులను తీసుకున్నామని స్టార్ స్పోర్ట్స్ చెబుతోంది. ఇక స్టార్ స్పోర్ట్స్ లేవనెత్తిన అభ్యంతరాలను ఏసీసీ, బీసీసీఐ ముందుకు తీసుకెళ్లగా, బోర్డు ఘాటుగా స్పందించినట్టు సమాచారం. ప్రసార హక్కులున్న సంస్థగానీ, ఏసీసీగానీ జట్టు సెలక్షన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, అందుబాటులో ఉన్న బెస్ట్ జట్టునే తాము పంపించామని బీసీసీఐ పెద్దలు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

More Telugu News