Pawan Kalyan: టీడీపీలో పట్టించుకోవడం లేదట... పవన్ కల్యాణ్ ను కలిసిన విశాఖ నేత!

  • పవన్ తో చర్చించిన సుందరపు విజయ్ కుమార్
  • టీడీపీ మోసం చేసిందని ఆరోపణ
  • పవన్ గౌరవంగా చూశారన్న విజయ్ కుమార్

విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతంలో మంచి పట్టున్న టీడీపీ నేతల్లో ఒకరైన సుందరపు విజయ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి చర్చించడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీసింది. నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు తాను ఎంతగా కృషి చేసినా, తనను గుర్తించలేదని విజయ్ కుమార్ వాపోయారు. 2013 స్థానిక ఎన్నికల్లో పంచాయితీల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకుంటే, తానే అందరినీ సెట్ చేసి, ముందుండి నడిపించానని చెప్పారు. 2014లో తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, లోకేశ్ ను కలిసి తన బాధలు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.

పవన్ కల్యాణ్ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించారని, గౌరవంగా చూశారని వ్యాఖ్యానించిన విజయ్ కుమార్, ఏ మాత్రం గౌరవం, గుర్తింపు లేని టీడీపీలో ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ మారే విషయంలో అభిమానులు, అనుచరులతో చర్చిస్తున్నానని చెప్పిన ఆయన, ఇప్పటివరకూ జనసేనలో చేరలేదని, త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు.

More Telugu News