England: ఇంగ్లండ్‌పై ఘోర పరాభవానికి కారణం చెప్పిన రవిశాస్త్రి!

  • కర్రన్ ప్రతిసారీ మా విజయాలను అడ్డుకున్నాడు
  • అతడు గొప్ప ఆల్ రౌండర్
  • కితాబిచ్చిన రవిశాస్త్రి

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి కారణమేంటో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఇంగ్లండ్ బాగా ఆడడం వల్ల తాము ఓడిపోలేదని తేల్చి చెప్పాడు. 20 ఏళ్ల ఆ జట్టు ఆల్ రౌండర్ శామ్ కర్రన్ వల్లే తాము ఓటమి పాలయ్యామన్నాడు. కర్రన్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన  ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-4తో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

‘‘మేమీ సిరీస్‌లో చెత్తగా ఆడడం వల్లే ఓడిపోయామని అనుకోవడం లేదు. చాలా వరకు ప్రయత్నించాం’’ అని శాస్త్రి పేర్కొన్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ కోసం ఆటగాడిని ఎంపిక చేయమన్నప్పుడు తాను, కెప్టెన్ కోహ్లీ ఇద్దరమూ శామ్ కర్రన్‌నే ఎంచుకున్నట్టు చెప్పాడు. ఇంగ్లండ్ కంటే తమను కర్రన్ వ్యక్తిగతంగా బాగా ఇబ్బంది పెట్టాడని రవి వివరించాడు. తమ విజయావకాశాలను అతడు లాగేసుకున్నాడని అన్నాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిందని, అప్పుడు కర్రన్ జట్టును ఆదుకున్నాడని, సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 86 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిందని, అప్పుడు కూడా కర్రన్ పరుగులు చేశాడని శాస్త్రి పేర్కొన్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో తాము వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్నప్పుడు కర్నన్ వికెట్లు పడగొట్టాడని.. ఇలా తమ విజయావకాశాలను కర్రన్ ఘోరంగా దెబ్బతీశాడని రవి వివరించాడు.

More Telugu News