Chandrababu: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

  • కోర్టు నోటీసులను చంద్రబాబు పబ్లిసిటీ కోసం వాడుతున్నారు
  • ఆపరేషన్ గరుడ అని కథలు చెప్పించి జనాలను నమ్మించాలనుకుంటున్నారు
  • కోర్టు నోటీసులిస్తే ఎందుకంత భయం?

ఏపీ సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని... అందుకే కోర్టు నోటీసులను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. నేడు శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.

ఓ వైపు రాయలసీమలో దుర్భిక్షం ఉంటే.. చంద్రబాబు మాత్రం శ్రీశైలానికి వచ్చి జలసిరి హారతి అంటూ కట్టుకథలు చెబుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సినీ నటులతో ఆపరేషన్ గరుడ అని కథలు చెప్పించి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన సొంత జిల్లా చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని ఏ రైతుతోనైనా రైతు బాంధవుడని పిలిపించుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. కోర్టు నోటీసులిస్తే ఎందుకంత భయమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 22 సార్లు కోర్టు నోటీసులిస్తే పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News