chandrababu: నేనెక్కడా అన్యాయం, నేరాలు, ఘోరాలు చేయలేదు...కేసు, వారెంట్ లపై నేను ఆలోచిస్తా: చంద్రబాబు

  • ఉత్తరాంధ్ర ఎడారిగా మారకూడదనే బాబ్లీ నిరసన చేపట్టాం
  • నేను ఏమి చేసినా ప్రజల కోసమే
  • నేను అన్యాయాలు, నేరాలు, ఘోరాలు చేయలేదు

బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వారెంట్ ఇస్తున్నారంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోందని... తానెక్కడా అన్యాయం చేయలేదని, నేరాలు, ఘోరాలు చేయలేదని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ప్రాజెక్టులోనే మరో ప్రాజెక్టును (బాబ్లీ) నిర్మించేందుకు అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఆవేదనతో నిరసన వ్యక్తం చేసేందుకు అక్కడకు వెళ్లామని చెప్పారు.

ఆరోజు మన బోర్డర్ లోనే తమను అరెస్ట్ చేశారని, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆ సందర్భంగా కేసులు పెట్టామని ఒకసారి, కేసులు పెట్టలేదని మరోసారి చెప్పి, ఒక పత్యేక విమానంలో తమను హైదరాబాదులో వదిలిపెట్టారని చెప్పారు. ఇప్పుడేమో నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ వారెంటులు ఇచ్చారని మాట్లాడుతున్నారని అన్నారు. శ్రీశైలం సభలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఉత్తర తెలంగాణకు అన్యాయం జరగకూడదనే ఆనాడు తాము పోరాడామని చంద్రబాబు చెప్పారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా టీడీపీ ప్రజల కోసమే పోరాడుతుందని తెలిపారు. ఆ కేసు గురించి, వారెంట్ గురించి ఏమి చేయాలనే దానిపై తాను ఆలోచిస్తానని చెప్పారు. తాను ఏమి చేసినా ప్రజల కోసమే అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఏ పార్టీ వల్ల మీ జీవితాల్లో వెలుగు వచ్చిందనే విషయం గురించి ఆలోచించి, టీడీపీకి సహకరించాలని విన్నవించారు.

More Telugu News